సంగీతపై మళ్లీ దాడి

268
another-attack-on-sangeetha reddy

భర్త, అత్తామామల చేతిలొ తీవ్ర వేధింపులకు గురై వారి ఇంటి ఎదుటే ధర్నాకు దిగి న్యాయపోరాటం చేసిన సంగీత పై మరోసారి దాడి జరిగింది. తన మరిది శ్రీధర్ రెడ్డి తో పాటు మామ బాల్ రెడ్డి మద్యం మైకంలో దాడి చేశారని సంగీత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు తీర్పును అనుసరించే తాను వారి ఇంట్లో ఉంటున్నానని, ఇది ఇష్టం లేని అత్తింటివారు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడినట్లు సంగీత పేర్కొంది.



ఈ దాడిపై బాధితురాలు సంగీత, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్‌ శ్రీనగర్‌ కాలనీలో నివసించే రియలెస్టేట్ వ్యాపారి పూలకండ్ల శ్రీనివాస్‌రెడ్డికి, శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీకి చెందిన సంగీతకు 2013లో వివాహం జరిగింది. అయితే సంగీత ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న కారణంగా భర్త శ్రీనివాస్‌రెడ్డి, అత్తామామలు వేధించారు. వీటిన భరిస్తూ వచ్చిన సంగీత, భర్త రెండో పెళ్లి చేసుకోడాన్ని మాత్రం భరించలేకపోయింది. రెండో భార్యతో ఏకంగా ఇంట్లోనే కాపురం పెట్టడంతో భరించలేక భర్తను ప్రశ్నించింది. దీంతో భర్త,అత్తామామలు కలిసి సంగీతను విచక్షణారహితంగా కొట్టి గతేడాది నవంబరు 19న ఇంటి నుంచి గెంటేసిన విషయం తెలిసిందే. దీంతో భర్త ఇంటిముందే న్యాయపోరాటానికి దిగిన సంగీత ఎట్టకేలకు కోర్టు తీర్పుతో భర్త ఇంట్లోకి చేరింది.

కొన్నాళ్లు మామూలుగానే వున్న అత్తింటివారు మళ్లీ వేధింపులకు దిగినట్లు సంగీత పోలీసులను ఆశ్రయించింది. మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌రెడ్డి తనపై దాడికి దిగారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.