కన్ను మూసిన వేణు మాధవ్

316

కమెడీయన్ వేణు మాధవ్(40) ఈరోజు మధ్యాహ్నం 12.21 నిమిషాలకు క‌న్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవ్ కు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వేణుమాధవ్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేప‌టి క్రితం ఆయన మరణించారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రముఖులు ప్రార్ధించారు. కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

వేణు మాధ‌వ్ 30 డిసెంబ‌ర్, 1979లో జ‌న్మించారు స్వ‌స్థ‌లం న‌ల్లొండ‌ జిల్లా. పెరిగింది కోదాడ‌. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు మీడియం లోనే చదివాడు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.

మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్ ఆ త‌ర్వాత క‌మెడీయ‌న్‌గా రాణించారు. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంప్ర‌దాయం చిత్రంతో ఆయ‌న ఆరంగేట్రం చేశారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు వేణుమాధవ్. టాలీవుడ్‌లో 600లకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన తొలి ప్రేమ చిత్రం ఆయ‌న‌కి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ త‌ర్వాత ఎన్నో చిత్రాల‌లో కామెడీతో అల‌రించాడు వేణు మాధ‌వ్.