కొత్త మంత్రులెవరు?

265
new ministers

రాష్ట్రమంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. గత ఎన్నికలతో పోల్చితే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తప్ప అన్ని జిల్లాల్లో పార్టీ గెలిచిన శాసనసభ స్థానాల సంఖ్య పెరిగింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి పాత మంత్రులిద్ద్దరిలో ఒకరిని మాత్రమే ప్రస్తుతం మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ముందుగా మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అవకాశం రావచ్చని తెలుస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈసారి ఆ జిల్లా నుంచి ఎవరికీ అవకాశం రాకపోవచ్చని అనుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లా నుంచి బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక్కరికే అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం లభించవచ్చు. మహబూబ్‌నగర్ నుంచి వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డితోపాటు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌కు కూడా మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరినీ తీసుకోకుండా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని తెలుస్తున్నది. హైదరాబాద్ నుంచి పాత ఇద్దరు మంత్రుల్లో ఒకరు మంత్రి, మరొకరు డిప్యూటీ స్పీకర్ అయ్యే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంత్రిగా, పద్మారావుగౌడ్ డిప్యూటీ స్పీకర్‌గా చేరే అవకాశాలున్నాయని భోగట్టా.

 




 

కరీంనగర్ జిల్లా నుంచి ఎస్సీ కోటా నుంచి సీనియర్ శాసనసభ్యుడు, పార్టీకి అత్యంత విధేయుడు కొప్పుల ఈశ్వర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. జిల్లానుంచి మరొకరికి అవకాశం ఇవ్వాల్సివస్తే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌నా లేక మరో బీసీ నాయకుడినా అన్న మీమాంస జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో సీట్లు కోల్పోవడం, చొప్పదండి సీటు విషయంలో అధిష్ఠానాన్ని ఇబ్బందిపెట్టడం వంటి అంశాలు ఈటలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అంటున్నారు. అయినా ఈటల రాజేందర్ ముఖ్యమంత్రికి ఉద్యమ సహచరునిగా, సన్నిహితునిగా, ఆర్థికమంత్రిగా, ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు.

అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వస్తారని చెప్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఇద్దరికి అవకాశం ఉండవచ్చునని, ప్రస్తుతం మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డికి, పార్లమెంటు ఎన్నికల తర్వాత గుత్తా సుఖేందర్‌రెడ్డికి స్థానం కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖమ్మంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో ఎవరికీ అవకాశం లభించకపోవచ్చని తెలుస్తున్నది. బహుశా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించవచ్చని అనుకుంటున్నారు. మహిళ, గిరిజన, తదితర సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.