
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వారసురాలిగా ప్రకటించుకున్న శశికళ గురువారం (4-3-2021) సంచలన నిర్ణయం తీసుకన్నారు.
ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆమె రాబోయే తమిళనాడు ఎన్నికల్లో తనదైన శైలిలో ముద్ర వేస్తారని అందరూ
భావించారు. కానీ ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పడం తమిళానాడులోనే కాకుండా యావత్ దేశం ఆశ్చర్యానికి గురి చేసింది.
తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతారనుకున్న ఏఐడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగానే తమిళ ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మళ్ళీ తన చరిష్మాతో తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేస్తారని అంతా ఊహించారు.
కానీ ఆమె ఈ ప్రకటన చేసి సరికొత్త సస్పెన్స్కు తెరలేపారు. ఈ తాజా పరిణామంపై అన్నాడీఎంకే లోలోపల హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ మౌనంగా ఉంది.
అటు శశికళ మేనల్లుడు అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ పూర్తి నిరాశలో మునిగిపోయారు.
ఆమెను తనను అన్నాడీఎంకే కీలక పదవుల నుంచి తొలగించినందుకు కోర్టుకెక్కుతామని కూడా ఆయన ప్రకటించారు. కానీ చిన్నమ్మ తీరు ఇందుకు భిన్నంగా ఉంది.
రాజకీయాలకు తాను గుడ్ బై చెప్పడమే కాదు, ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే గెలవాలని కోరుకున్నారు.
ఆ పార్టీ మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టాలని తాను ఆ భగవంతుడిని ప్రార్థిస్తానని శశికళ చెప్పారు.
రాష్ట్రంలో ఏఐడీఎంకే అధికారంలో కొనసాగాలన్న తన స్నేహితురాలు దివంగత సీఎం జయలలిత ఆశయం నెరవేరాలన్నదే తన కోర్కె కూడా అని ఆమె అన్నారు.
ఎన్నికలకు ముందు ఈ పార్టీ నేతలు కార్యకర్తలంతా సమైక్యంగా ఉండాలని సూచించారు. అప్పుడే తిరిగి తమ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయని ఆమె భావించినట్టు తెలుస్తోంది.
బెంగుళూరు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ఆమె ఇలాగె వ్యాఖ్యానించారు. జయలలితను అభిమానించేవారంతా తమిళనాడులో డీఎంకేను ఓడించాలని ఆమె తరచూ చెబుతూ వచ్చారు.
తనకు పదవీ వ్యామోహం లేదని, ఏ పోస్టునూ తాను ఆశించడంలేదని శశికళ అన్నారు. జయలలిత కన్న కలలను నిజం చేయాలన్నారు.
అన్నాడీఎంకే నేతలపై శశికళ ఒక్క విమర్శ కూడా చేయని అంశాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. శశికళ నిర్ణయం బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా షాకిచ్చింది!
శశికళ నిర్ణయంపై స్పందించిన దినకరన్ అన్నాడీఎంకేను సమైక్యంగా ఉంచేందుకే ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని అన్నారు.
శశికళ తీసుకున్న హఠాత్ నిర్ణయం బీజేపీకి పెద్ద దెబ్బ అని ఆమె ద్వారా అన్నాడీఎంకే ద్వారా తమిళనాట చక్రం తిప్పాలనుకున్న వాళ్లు డీలా పడిపోయారని కాంగ్రెస్ నేత అళగిరి వ్యాఖ్యానించారు .