ఎల్‌బీనగర్‌ వైపు మెట్రో టెస్ట్‌ రన్‌

1228
metro rail test run to lb nagar

మెట్రో ప్రాజెక్టులో మరో కీలక అడుగు ముందుకుపడింది.అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ కారిడార్‌లో మెట్రో రైలు పరీక్షల కోసం పరుగులు పెట్టింది. ఎప్పుడెప్పుడాని చూస్తున్న ఈ ప్రాంత వాసులకు టెస్ట్‌ రన్‌తో కొంత ఊరట కలిగింది. త్వరలోనే మెట్రో తమ ప్రాంతాల మీదుగా పరుగులు పెట్టనుందంటూ సంబరపడుతున్నారు. మొదటి రోజు జరిగిన టెస్ట్‌రన్‌ పనులను స్థానికులు ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. బుధవారం ఉదయం వేళల్లో మియాపూర్‌ డిపో నుంచి బయలు దేరిన మెట్రో రైలు అమీర్‌పేట ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వైపు టెస్ట్‌ రన్‌ కోసం ముందుకు కదిలింది. జూన్‌ కల్లా మెట్రోను ప్రారభించేలా కార్యచరణ సిద్ధం చేసి పనులను చేపట్టారు. ఇప్పటి వరకు ట్రాక్‌ నిర్మాణం, విద్యుద్దీకరణ, సిగ్నలింగ్‌, టెలికమ్యూనికేషన్‌ పనులు పూర్తి చేసిన మెట్రో అధికారు లు రైలును పరీక్ష కోసం నడిపారు. ప్రతి రోజూ 3-4 కి.మీ చొప్పున ఎల్‌బీనగర్‌ వరకు టెస్ట్‌రన్‌ను నిర్వహించిన తర్వాత ట్రయల్‌ రన్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.



ఈ మార్గంలో అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాత కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైలు సేప్టీ నుంచి అంతిమంగా అనుమతి పొందిన తర్వాతే ప్రయాణికులను అనుమతించనున్నారు. అప్పటి వరకు ఈ మార్గంలో పలుమార్లు టెస్ట్‌ రన్‌, ట్రయల్‌ రన్స్‌ను నిర్వహించనున్నారు. నిర్మాణంలో ఉన్న మెట్రో పనులను త్వరగా పూర్తి చేసి మెట్రోను ప్రయాణికులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈమేరకు జూన్‌ కల్లా అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ కారిడార్‌లో మెట్రో రైలును ప్రారంభించి, అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గాల్లో ఆగస్టు నాటికి మెట్రో రైలును ప్రారంభించేలా కార్యాచరణను సిద్ధం చే శారు. ఇక మిగిలిన కారిడార్‌-2 (జేబీఎస్‌-ఎంజీబీఎ్‌స)లో ఈ ఏడాది చివరి నాటికి మెట్రో పరుగులు పెట్టనుంది.