![peddireddy ramachandrareddy Ap Minister Peddireddy](https://telugu.teenmaar.news/wp-content/uploads/2021/02/peddireddy-ramachandrareddy.jpg)
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. ఏకగ్రీవాలను అడ్డుకోవాలని నిమ్మగడ్డ, టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ టీడీపీకి సహకరిస్తున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఉన్నారని మంత్రి దుయ్యబట్టారు. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో పర్యటిస్తున్న నిమ్మగడ్డ చిత్తూరు జిల్లాలో ఆ విషయం గురించి చెపితే బాగుంటుందని అన్నారు.
వైసీపీ నేతలు ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు చేయడం లేదని చెప్పారు. అనేక విషయాలపై మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేశ్ గతంలో చంద్రబాబు వద్ద కూడా తాను పని చేశానని చెపితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అయినా నిమ్మగడ్డ ఏమీ చేయడం లేదని విమర్శించారు. దళితులపై టీడీపీ వాళ్ల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. తన నియోజక వర్గంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.